అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది
కవిత కేసీఆర్ కు లేఖ రాయడంపై స్పందించిన కేటీఆర్
హైదరాబాద్, బతుకమ్మ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు కవిత లేఖ రాయడంపై ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమి కాదన్నారు. ఈసందర్భంగా కవితకు పరోక్షంగా కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు అన్నారు. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదన్నారు. మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందన్నారు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారని, సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అధిష్ఠానానికి డబ్బులు ఇస్తూ రేవంత్ రెడ్డి సీఎం పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ సంపదను ఢిల్లీ బాసులకు దోచిపెట్టారన్నారు. బీఆర్ఎస్పై నిందలు వేస్తూ.. కాంట్రాక్టర్లతో దందాలు చేస్తున్నారని విమర్శించారు. ఈడీ చార్జిషీట్ లో రేవంత్ రెడ్డి పేరుందన్నారు. రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నారని ప్రశ్నించారు. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప హౌసింగ్ స్కాంకు పాల్పడినప్పుడు, కాంగ్రెస్ నాయకులంతా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. వాళ్లు చేసిన డిమాండ్ల మేరకు యాడ్యూరప్ప రాజీనామా చేశాడన్నారు. రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు.