. . . నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నివాసాలలో ఏసీబీ సోదాలు
నిజామాబాద్, బతుకమ్మ :
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఫిర్యాదుల నేపథ్యంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలలో అవినీతి నిరోధక శాఖ తనిఖీలు చేపట్టింది. మంగళవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ లో గల అద్దె ఇంటితో పాటు నగరంలోని సుభాష్ నగర్ లోని ఈఎస్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. మల్లారెడ్డికి స్వస్థలం వరంగల్ జిల్లా జనగామ పాటు హైదరబాద్ లోని నివాసంతో పాటు బంధువుల ఇళ్ళలో ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ జిల్లా బాస్ నివాసంలో తనిఖీలతో ఆబ్కారి శాఖలో కలకలం రేపింది. ఎక్కడి అధికారులు అక్కడ గప్ చూప్ అయ్యారు. సోమవారం వరకు రాకపోకలకు సందడిగా ఉండే ఈఎస్ కార్యాలయంలో ఏసీబీ సోదాల నేపథ్యంలో కల్లు మూస్తేదార్లు, మద్యం వ్యాపారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు.

. . . వంద కోట్ల క్లబ్ లో మల్లారెడ్డి
ఇటీవల కాలంలో అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులలో తనిఖీలు నిర్వహిస్తుంటే కోట్ల కొద్ది ఆస్తులు బయటపడడం రివాజుగా మారింది. గడిచిన వారం ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఆస్తులు రూ.200 కోట్లు కాగా ల్యాండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి రావు 180 కోట్ల ఆస్తులను గుర్తించి ఏసీబీ కటకటల వెనక్కి పంపిం ది. ఈ రెండు కేసుల తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆబ్కారి శాఖ వైపు నజర్ వేయగా నిజామాబాద్ ఈఎస్ మల్లారెడ్డి పై ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు నిర్వహించింది.

ఈ సోదాలలో 4 బిల్డింగ్ లు, 8 ఓపెన్ ప్లాట్ లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. 3 లక్షల 31 వేల నగదు లభించింది. బ్యాంక్ లో రూ.50 లక్షల నిల్వ నగదు ఉన్నట్లు గుర్తించారు. మల్లారెడ్డితో పాటు ఆయన భార్య పేరు మీద మూడు లాకర్లను గుర్తించినా వాటిని ఓపెన్ చేయలేదు.మల్లారెడ్డి నివాసంలో ఒక గ్రాండ్ వీటా కారు, ఒక స్కూటిని గుర్తించారు. మొత్తం మల్లారెడ్డి నివాసంలో దొరికిన ఆస్తుల విలువ రూ.3 కోట్లుగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. మూడు లాకర్లు తెరిచి చూస్తే ఇంకా ఎక్కువ ఆస్తులు, నగదు, బంగారం బయటపడే అవకాశాలున్నాయి. మల్లారెడ్డిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించింది.

. . . ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ద్వారా వసూళ్ళు
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేసి రిటైర్డ్ అయినా హెడ్ కానిస్టేబుల్ ద్వారా వసూళ్ళ పర్వం కొనసాగుతున్నట్లు సమాచారం ఆయన ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరి హెడ్ కానిస్టేబుల్ గా రిటైర్డ్ అయినప్పటికీ ఎన్నడు ఫీల్డ్ డ్యూటీ ఎరుగడనేది ఆబ్కారి శాఖ రికార్డులు చెబుతున్నాయి.

ఏనాడు కూడా యూనిఫాం ధరించని ఆ హెడ్ కానిస్టేబుల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లకు వసూళ్ళకు సూత్రదారి అని చెబుతారు. కల్లుగీత కార్మికుడి లైసెన్స్ మొదలుకుని సొసైటీల ఏర్పాటు, మద్యం షాప్ లకు లైసెన్స్ లు దక్కిన తర్వాత ఇచ్చే అసలు పత్రాలకు కూడా డబ్బులు వసూల్ చేయడం నిత్యడ్యూటీ అని ఎక్సైజ్ శాఖలో చెబుతున్నారు. ప్రతీనెల కల్లుమూస్తేదారులు, మద్యం సిండికేట్ వ్యాపారులు, ఏవైనా కేసుల తాలుకు పంచాయితీలు తేలాలంటే హెడ్ కానిస్టేబుల్ కు డబ్బులు అందితేనే పని జరుగుతుందని చెబుతారు. మల్లారెడ్డి హయంలోనే రిటైర్డ్ అయిన హెడ్ కానిస్టేబుల్ ను కార్యాలయంలో కొనసాగించడం వెనుక వసూళ్ళ పర్వమే కారణమని టాక్ ఉంది. ఇటీవల కాలంలో ఎక్సైజ్ శాఖలో పని చేసి ఇతర జిల్లాలకు ట్రాన్స్ ఫర్ అయిన కొందరు కానిస్టేబుళ్ళే నిజామాబాద్ జిల్లాలోని ఎక్సైజ్ అధికారుల అవినీతి చిట్టా మామూళ్ళ జాబితాను ఏసీబీకి అందజేశారని వారిచ్చిన క్లూతోనే రైడ్లు జరిగినట్లు చర్చ జరుగుతుంది.

