. . . రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వండి
. . . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి విజ్ఞప్తి
బాల్కొండ, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్ పంప్ హౌస్ వద్ద రైతులతో కలిసి వినూత్న నిరసన చేపట్టిన ఆయన, నా రక్తం తీసుకోండి….”రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి…అంటూ స్వయంగా రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాల్కొండ రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ గతంలో వర్షాభావ పరిస్థితులపై ప్రశ్నించిన విలేకరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “వాళ్ళ రక్తం చల్లితే పంటలు పండుతాయి ?” అని రాక్షసంగా వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అడిగినట్లుగానే నేడు నాతో పాటు బాల్కొండ రైతులు తమ రక్తాన్ని ఇస్తున్నారని, ఇప్పుడు అయినా రైతుల పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరిలో కాళేశ్వరం వద్ద రోజుకు 10 టీఎంసీ ల నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లి కి తీసుకువచ్చి అక్కడ నుండి వరద కాలువలోకి ఎత్తిపోసే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు. వరద కాలువపై కేసీఆర్ కట్టిన రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌస్లు పూర్తిగా సురక్షితంగా, రివర్స్ పంపింగ్కు సిద్ధంగా ఉన్నాయని వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లో కాళేశ్వరం జలాలను పోయాలని డిమాండ్ చేసారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, నిజామాబాద్ జిల్లా రైతుల అత్యవసర అవసరాల కోసం వెంటనే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ 4 టీఎంసీలను వరద కాలువకు – 0.5 టీఎంసీ, కాకతీయ కాలువకు – 0.5 టీఎంసీ, గోదావరి నదికి – 0.5 టీఎంసీ, మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ (ప్యాకేజీ-21) ద్వారా కప్పలవాగు, పెద్దవాగులకు – 0.5 టీఎంసీ, గుత్ప – అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు, చెరువుల నింపుదలకు – 2 టీఎంసీలు వినియోగించాలని సూచించారు. ఈ విధంగా నీరు విడుదల చేస్తే కనీసం 15 రోజుల పాటు రైతుల పంటలను కాపాడుకోవచ్చని, ఈ లోపు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని తిరిగి నింపుకోవచ్చని వివరించారు. మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ను ప్రారంభించడం ద్వారా కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పారించవచ్చని,గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 6 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరద కాలువకు, కాకతీయ కాలువలకు నీటిని విడుదల చేశామని, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు నీరు ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల పక్షాన ముఖ్యమంత్రి వద్ద రైతుల పక్షాన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న ఇరిగేషన్ మంత్రి స్థాయిలో జరిగే శివమ్ సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వరద కాలువ, కాకతీయ కాలువ, గోదావరి, కప్పలవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల్లో రైతులతో కలిసి దశలవారీగా ధర్నాలు, ఆందోళనలు చేపడతానని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

