హైదరాబాద్, బతుకమ్మ : బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్లకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన భర్త అనిల్పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ ఈనోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, కవిత గురువారం హైదరాబాద్ లోని మలక్పేట, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో పర్యటించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై కవిత పలు ఆరోపణలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై మాధవరం కృష్ణారావు తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కవిత నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.