- సమన్వయంతో ఫలితాలు
- అందరి శ్రమ ఫలితమే
- లోక్ అదాలత్ సక్సెస్ మీట్ లో జిల్లాజడ్జి, పోలీస్ కమిషనర్
నిజాామాబాద్ క్రైం, బతుకమ్మ : రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయంతో అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిజానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. సెప్టెంబర్ 28 న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతం అయిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ని సమావేశపు హల్ లో నిర్వహించిన లోక్ అదాలత్ సక్సెస్ మీట్ లో ఆమె ప్రధానోపన్యాసం చేశారు. వినాయక చవితి పండుగ నవరాత్రులలో బందోబస్తు విధులలో తీరిక లేకుండా ఉన్న ఆ తరువాత లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ చాలా శ్రమించిందని ఆమె ప్రశంసించారు.పన్నెండు వేల రాజీపడదగిన క్రిమినల్ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడం గొప్ప విషయమని కొనియాడారు. పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది నిరంతరం శ్రమిస్తు ,సమన్వయ పర్చుకుని తక్కువ సమయంలో ఎక్కువ క్రిమినల్ కేసుల పరిష్కారం లో భాగస్వాములు కావడం అభినందనీయమని పేర్కొన్నారు. కక్షిదారులను కేసుల రాజీ విషయంలో సమన్వయ పర్చుకుని కోర్టుల మెట్ల వరకు వారిని తీసుకుని రావడం లోక్ అదాలత్ చైతన్య దీప్తికి నిదర్శనమని జిల్లాజడ్జి తెలిపారు. జ్యూడిషియరి,పోలీస్ శాఖ మధ్య సమన్వయం భవిష్యత్ లోక్ అదాలత్ లకు ప్రేరణగా నిలవాలని ఆమె ఆశించారు.పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారమే పోలీస్ శాఖ సమన్వయం చేసుకుని లోక్ అదాలత్ విజయంలో తన పాత్రను పోషించిందని తెలిపారు. సమాజం పట్ల బాధ్యత, నేర రహిత వ్యవస్థ పట్ల లక్ష్యం లోక్ అదాలత్ కు మార్గం చూపించిందని అన్నారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులను ఫిర్యాదుదారులు,బాధితులు కలిసి పరిష్కరించుకునే విధానంలో పోలీసులకు స్వేచ్ఛను ఇచ్చామని తెలుపుతూ ఆ దిశగా పోలీసులు విజయవంతం అయ్యారని అన్నారు. సైబర్ నేరాలలో క్రియాశీలకంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచినట్లు ఆయన తెలిపారు.

లోక అదాలత్ పయనంలో జ్యూడిషియరీ, పోలీస్ శాఖ మధ్య సమన్వయం కొనసాగాలని అంతిమంగా సమాజంలో వ్యక్తుల మధ్య వ్యక్తిగత కక్షలు ఉండకుండా సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలనే లక్ష్యం తో పోలీసు శాఖ విధులు నిర్వహిస్తుందని పోలీస్ కమిషనర్ కలమేశ్వర్ ఆకాక్షించారు.సక్సెస్ మీట్ సమావేశ అనంతరం పోలీసు అధికారులకు,పోలీస్ కానిస్టేబుల్ కు జిల్లాజడ్జి,పోలీస్ కమిషనర్ ప్రశంస పత్రాలు అందజేశారు. సమావేశంలో అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్(అడ్మినిస్ట్రేషన్) కోటేశ్వరరావు, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్(ఎ ఆర్) శంకర్ నాయక్,నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లు రాజా వెంకట రెడ్డి, వెంటేశ్వర్ రావు,శ్రీనివాస్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ నారాయణ, ఎస్ బి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు ,డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మి నర్సయ్య, అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటర్స్ మహమ్మద్ రహీమోద్దీ న్ ,రాజేష్ గౌడ్, రాణి జిల్లా కోర్టు లైజన్ అధికారి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

