బతుకమ్మ : నాగిరెడ్డిపేట : చెల్లెలు పెళ్లిలో ఇస్తామన్న వరకట్నం బంగారం ఇవ్వకపోవడంతో చెల్లెలి భర్త పెట్టిన వరకట్న వేధింపులు భరించలేక అన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని గోలి లింగాల్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై పోరెడ్డి మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గోలిలింగాల గ్రామానికి చెందిన పిట్ల నర్సింలు వయస్సు (30) యువకుడు తన చెల్లెలు భవాని వివాహం మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన దయానంద్ అనే వ్యక్తికి తో గత నాలుగు సంవత్సరాల క్రితం కట్న కానుకలు పెట్టి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. అయితే వివాహ సమయంలో చెల్లెలుకు వరకట్నం క్రింద ఇవ్వాల్సిన ఏడున్నర తులాల బంగారం తోపాటు ఇతర కట్న కానుకలు పెట్టి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో ఏడున్నర తులాల బంగారం పెట్టాల్సి ఉండగా, ఐదున్నర తులాల బంగారం మాత్రం పెట్టడం జరిగిందన్నారు. మిగతా రెండు తులాల బంగారం గురించి తన చెల్లెలి భర్త దయానంద్ నర్సింలు ను, నర్సింలు తల్లిదండ్రులను తరచూ బంగారం పెట్టాలని అడిగేవారని, చెల్లెలు వివాహానికి చేసిన అప్పులు పెరిగిపోవడంతో పాటు, మిగతా రెండు తులాల బంగారం కొనివ్వడానికి డబ్బులు లేక నర్సింలు తండ్రి దుర్గయ్య,తల్లి పర్వవ్వ లు ఇద్దరూ కామారెడ్డిలో వాచ్మెన్ గా పని చేస్తుండగా, మృతుడు నర్సింలు కూలి నాలి చేసి చేసిన అప్పులు తీర్చలేక చెల్లెలకు ఇవ్వాల్సిన మిగతా బంగారం కొనిఇవ్వలేక జీవితంపై విరిక్తి చెంది తన పూరి గుడిసెలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. పిట్ల నరసింహులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పోరెడ్డి మల్లారెడ్డి తెలిపారు.