ఆర్మూర్, బతుకమ్మ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం ఏప్రిల్ 10 నుండి ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజయవంతంగా అమలవుతోంది. ఈ విధానంలో ప్రజలు తమకు అనుకూల సమయానికి స్లాట్ బుక్ చేసుకుని, లైన్లలో వేచి ఉండకుండా వేగంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ప్రతి రోజు సగటున 48 డాక్యుమెంట్లు ఈ విధానంలో రిజిస్టర్ అవుతున్నందున, కార్యాలయ పనితీరు మరింత పటిష్టంగా మారింది. అయితే, కొన్ని సందర్భాల్లో, నిర్ణీత సమయానికి హాజరుకాక ఆలస్యం జరిగితే, ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన సబ్ రిజిస్ట్రార్ మహేందర్ రెడ్డి, “స్లాట్కు కనీసం 10 నిమిషాల ముందుగా కార్యాలయానికి వచ్చి, అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచాలని” సూచించారు. ఆలస్యంగా వచ్చినపక్షంలో, ఆ స్లాట్ ఆటోమేటిక్గా రద్దయి, రిజిస్ట్రేషన్ మరొక రోజుకు వాయిదా పడే అవకాశం ఉన్నదని చెప్పారు. ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకోవడం వలన అర గంటలో రిజిస్ట్రేషన్ పూర్తి అయి ప్రజల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, అధికారుల పని నిర్వహణలో పారదర్శకతను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ అయిన రోజే పూర్తి అయిన డాక్యుమెంట్ లు చేతికి అందిస్తున్నారు, గతంలో వారం రోజులు పట్టే పని ఒకే రోజులో జరగడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సహకారంతో ఈ విధానం విజయవంతంగా కొనసాగుతుందని, రిజిస్ట్రేషన్ సేవల్లో ఆర్మూర్ కార్యాలయం రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
