27.1 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్ఆర్ఎస్ రిబేటు సదుపాయం గడువు పొడిగింపు

Must read

📰 Generate e-Paper Clip

  •  మే 3 వరకు చెల్లింపులకు అవకాశం
  • సద్వినియోగం చేసుకోవాలని కోరిన కలెక్టర్

 

నిజామాబాద్, బతుకమ్మ : అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణ, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ 25 శాతం రాయితీ సదుపాయాన్ని మరో మూడు రోజుల పాటు పొడిగించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ నాటితో ఈ గడువు ముగియగా, ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ఎల్.ఆర్.ఎస్ గడువును మే 3వ తేదీ వరకు పొడిగించిందని అన్నారు. జిల్లాలోని అర్హులైన వారందరూ ఈ వెసులుబాటును  సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎఫ్.టి.ఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్.ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రుసుము ఎంత అనేది దరఖాస్తుదారులు తమ సెల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు మే 3వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే 25 శాతం రిబేటు వర్తిస్తుందని తెలిపారు.  వివిధ కారణాల వల్ల రెగ్యులరైజేషన్ చేసుకోలేకపోయిన వారి కోసం మరో అవకాశం కల్పిస్తూ రాయితీ సదుపాయం గడువును ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించిందని అన్నారు. అనధికారికంగా లేఅవుట్లు చేసి, అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు ఉందని, ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.  క్రమబద్ధీకరించని భూములలో  రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయబడవని కలెక్టర్ స్పష్టం చేశారు.

More articles

Latest article