ఇందల్వాయి పీహెచ్ సీ ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్
పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
ఇందల్వాయి,బతుకమ్మ : విద్యార్థులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇందల్వాయి పీహెచ్ సీ ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల లో ఇందల్వాయి పీహెచ్ సీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత ఆరోగ్య శిబిరము , సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ మాట్లాడుతూ సీజన్ మారడం వలన వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ,చికున్ గున్యా,ఫైలేరియా మెదడువాపు లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఈగల వ్యాప్తిని అరికట్టాలని ఈగల వలన డయేరియా, కలరా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. పాఠశాల చుట్టూ వాతావరణన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ పద్మజ ని ఆదేశించారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. విద్యార్థులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తాజా ఆకుకూరలు కూరగాయలు గల ఆహారాన్ని తీసుకోవాలని ప్రతిరోజు పాలు, గుడ్లు ఖచ్చితంగా ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలని తెలిపారు. బెల్లం పల్లీలు, మునగ ఆకులు, మునగ కాడలు, తీసుకోవాలని తెలిపారు. సాయంత్రం పాఠశాలలో ఇచ్చే ఉడకపెట్టిన పల్లీలు, బఠానీలు, శెనిగలు తినాలని వాటిలో బి. కాంప్లెక్స్ అధికంగా ఉంటుందని తెలిపారు. పండ్లు, ఆరెంజ్ లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.సూర్యరశ్మి లో విటమిన్ డి లభిస్తుందనితెలిపారు.పౌష్టికాహారాన్ని తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని తెలిపారు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు మానసికంగా శారీరకంగా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. ఎల్. ఎచ్. పి. డాక్టర్. వినీత్, ఆరోగ్య కార్యకర్తలు శారదా, భానుప్రియ ఆశా కార్యకర్తలు ప్రమీల, జ్యోతి, ప్రియాంక పాల్గొన్నారు.


