- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
రాజంపేట్, బతుకమ్మ : ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయ సంఘాల కోసం పెట్రోల్ బంక్ స్థాపనకు అవసరమైన భూమిని ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు. గ్రామ మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. రాజంపేట్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ హౌసింగ్, మహిళా శక్తి బృందాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొండాపూర్ గ్రామంలో ఇందిరా క్రాంతి మహిళా సంఘాల కార్యకలాపాల కోసం ప్రత్యేక భవన నిర్మాణాన్ని త్వరలో చేపడతామని ఎమ్మెల్యే మదన్ మోహన్ హామీ ఇచ్చారు.

