- జోల పాట పాడుతూ పరవశించిన భక్త జనులు

భీమ్ గల్, బతుకమ్మ : నింబచల లక్ష్మీనర్సింహాస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ అర్చకులు కొండపైన గల సీతానగరిపై శ్రీవారికి డోలసేవను కన్నుల విందుగా జరిపించారు. ఈ సందర్బంగా అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల అంటూ భక్తి సంకీర్తనలతో ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆ దేవదేవుని డోలసేవను ఘనంగా నిర్వహించారు. ఈ మధుర ఘట్టాన్ని తిలకించిన భక్తజనం ఆనంద పరవశంతో మునిగి తేలారు. స్వామివారి ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగరంలో గల నాలుగు స్తంభాల రాతి మందిరంలో డోలా సేవను నిర్వహించారు.

శ్రీ లక్ష్మీ నరసింహ ఉత్సవమూర్తులను పల్లకిలో వేద మంత్రోచ్ఛారణల నడుమ భాజా భజంత్రీలు మేళతాళాలతో సీతానగరంలోని మండపానికి తీసుకువచ్చి డోల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ పారవశంలో మునిగిపోయారు. తిరుగు ప్రయాణంలో జోడులింగంలకు ఎదురుగా నిలిపి శ్రీ లక్ష్మీనరసింహుని నుంచి జోడు లింగముల దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
