- ప్రాజెక్టులో 65 టీఎంసీల నీరు
- కాలువల ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటి విడుదల
మెండోరా, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతుంది. ప్రాజెక్టుకు లక్షన్నర క్యూసెక్కుల వరద పోటెత్తింది. శనివారం లక్ష క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా ఆదివారం అది లక్షన్నరకు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 80.5 టీఎంసీలకు గాను సాయంత్రానికి 65.867 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ఇందిరమ్మ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లోను 5 వేలకు పెంచారు. ఇరిగేషన్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆలీసాగర్ లిఫ్ట్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ

ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 15,827 క్యూసెక్కుల నీటిని దిగువకు వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకుంటుండడంతో గేట్లను ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జూన్ 1 నుంచి 54.429 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. ఇప్పటి వరకు 9.376 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గడిచిన ఏడాది ఆగస్టు 17న 48.295 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 65 టీఎంసీలు ఉండడంతో ప్రాజెక్టు వేగంగా నిండడంతో పాటు గేట్లను ఎత్తడం ఖాయంగా మారింది. దాంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి జెన్ కో అధికారులు సన్నద్దమౌతున్నారు.
