నిజాంసాగర్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగానికి నిజాంసాగర్ ప్రాజెక్టు భరోసా ఇవ్వడం ఖాయమైంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీ స్థాయిలో వరద పోటెత్తుతుంది. ఈ సీజన్ లో అత్యధికంగా 50 వేల క్యూసెక్కుల వరద రావడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతులతో పాటు తాగునీటికి ఢోకా ఉండదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 12,881 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాయంత్రానికి ప్రాజెక్టులో 49 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న సింగూర్ డ్యాం నుంచి 43 వేల 634 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతుండగా అది మంజిరా నది ద్వారా నిజాంసాగర్ చేరుకుంది. అదే విధంగా సింగితం, కళ్యాణి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ప్రజలెవ్వరు నది పరివాహక ప్రాంతంలోకి రావొద్దని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరకముందే గేట్లను ఎత్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.