- ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, బతుకమ్మ : నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను మరింత వేగంగా జరిపించాలని, ఎక్కువ యంత్రాలను తెప్పించి మరింత వేగంగా రాత్రింబవళ్లు పనులు చేయాలని కాంట్రాక్టర్ కు ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దాపూర్ రిజర్వాయర్ రూ. 258 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టీఎంసీ కేపసిటీ తో నిర్మిస్తున్నామని, నిర్మాణ పనులు త్వరితంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు వేగంగా జరిపించడంతో పాటుగా నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు.

రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటానన్నారు. సిద్దపూర్ రిజర్వాయర్ నా ఆశయం, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా సాగునీరు అందాలని ఆకాంక్షించారు. అనంతరం జాకోరా ఎత్తి పోతల పథకం నిర్మాణ పనులను, వర్ని మండల కేంద్రంలోని నూతనంగా రూ. 10.70 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు సీఈ శ్రీనివాస్, ఎస్ సీ రాజశేఖర్, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

