- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నిజామాబాద్, బతుకమ్మ : బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక – ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల అధికారులతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు ఈ వీ.సీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థుల సంక్షేమంపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం, ఇతర మౌలిక వసతుల అమలుపై పాఠశాలలను సందర్శించి పరిశీలించాలని తెలిపారు. ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా విద్యాబోధన కొనసాగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు రజిత, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగురావు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
