బీబీపేట్, బతుకమ్మ : బీబీపేట్ పోలీస్ స్టేషన్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్రం సోమవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, సిబ్బంది బ్యారక్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించారు. ఇది సిబ్బందిలో నిబద్ధత, క్రమ శిక్షణ, బాధ్యతా భావాలను పెంపొందిచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సిబ్బంది క్రమ శిక్షణ, సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాలని తెలిపారు. సస్పెక్ట్ ప్రతి కదలికపై నిఘా పెట్టాలని, నేరాల అదుపునకు పటిష్టమైన గస్తీ – పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల రక్షణే ధ్యేయంగా విధుల్లో నిబద్ధత చూపాలన్నారు. డయల్ 100 ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా, సమర్థవంతంగా స్పందిస్తూ ప్రజల విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని సూచించారు. ఆయన వెంట ఎఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్ఐ ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.

