నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ శనివారం ముద్ఖేడ్ – సికింద్రాబాద్ సెక్షన్లో విస్తృతంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా జీఎం తో పాటు హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ సంతోష్ కుమార్ వర్మ, ఇతర సీనియర్ అధికారులూ ఉన్నారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ముద్ఖేడ్ – సికింద్రాబాద్ సెక్షన్లో రియర్ విండో ఇన్స్పెక్షన్ చేసి, రైలు పట్టాలు, సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనలు, కీలక రైల్వే స్టేషన్ల భద్రతా అంశాలను సమీక్షించారు. బసర రైల్వే స్టేషన్లో పలు సౌకర్యాలు, బాహ్య ప్రదేశాల ఏరియాను పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న స్టేషన్ అభివృద్ధి పనుల పురోగతిని జీఎం సమీక్షించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించిన జీఎం, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ పనుల పురోగతిని పరిశీలించి, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, స్టేషన్ వెలుపల సర్క్యులేటింగ్ ఏరియాను పరిశీలించారు. నాందేడ్ రైల్వే స్టేషన్ను తనిఖీ చేసి, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, స్టేషన్లో లభ్యమయ్యే సదుపాయాలను పరిశీలించారు. డీఆర్ఎంతో పాటు ఇతర సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, డివిజన్ చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. పర్యటనలో భాగంగా జీఎం వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కూలీలను కలసి వారి సమస్యలు వినిపించుకున్నారు.

