. . . తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న రైతులు
మోపాల్, బతుకమ్మ :
గత నెల రోజుల నుండి వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామం లో గత నెల రోజుల నుండి వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షం కురుస్తుందోనని భయపడుతున్నారు. ధాన్యం ఎవరు దొంగలిస్తారో అని ధాన్యం కుప్పల వద్ద రైతులు పడి కాపులు కాస్తున్నారు. ధాన్యం కుప్పల నుండి ధాన్యం తరలించాలని సొసైటీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సొసైటీ సిబ్బందికి ఆదేశాలిచ్చినా రైతన్నలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొనుగోళ్లు వేగంగా జరగకపోవడంతో రోడ్లపై, కల్లాల్లో ఎటు చూసినా ధాన్యం కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సొసైటీ అధికారులు స్పందించి కులాస్ పూర్ గ్రామం నుండి తొందరగా ధాన్యాన్ని తరలించాలని రైతులు కోరారు.

