. . . బంద్, ర్యాలీలపై నిషేధం
ఆర్మూర్, బతుకమ్మ :
ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూలులో జరిగిన సంఘటన నేపథ్యంలో ప్రజాశాంతి, భద్రత పరిరక్షణ కోసం ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (పాత సెక్షన్ 144 సీఆర్పీసీ) అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో జూన్ 29, 30 తేదీల్లో బంద్లు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జూన్ 29 ఉదయం 6 గంటల నుంచి జూన్ 30 సాయంత్రం 5 గంటల వరకు ఆర్మూర్ పట్టణంలో ఐదుగురికి మించి గుంపులుగా చేరడం నిషేధం. ప్రజలు శాంతిభద్రతలకు సహకరించాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు వదంతులను నమ్మకుండా, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ కోరారు.
