. . . సుమారు 70 లక్షలు పైగా నకిలీ బిల్లులతో మోసం
. . . ముగ్గురిపై కేసు నమోదు . . . ఒకరి అరెస్టు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దవఖానాలకు అడ్డా అయిన ఖలీల్ వాడిలో స్కానింగ్ సెంటర్ యజమానిని ఉద్యోగులు నిండా ముంచిన సంఘటన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. యజమాని వద్ద 17 సంవత్సరాలుగా నమ్మకంగా పని చేసిన స్కానింగ్ సెంటర్ సూపర్ వైజర్, మరో ఉద్యోగినితో కలిసి స్కానింగ్ చేసుకున్నందుకు ఇచ్చే బిల్లులో ట్యాంపరింగ్ చేసి లక్షలు కాజేశారు. ఇటీవల అనుమానం వచ్చిన యజమాని స్థానిక 1వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సరస్వతినగర్ లో 2009లో ఏర్పాటు అయిన ఒక స్కానింగ్ సెంటర్ లో గుండారంకు చెందిన సత్యనారాయణ సూపర్ వైజర్ గా, మీనా అనే మహిళ టెక్నిషియన్ గా చేరి సేవలందిస్తున్నారు. యజమానికి నమ్మకంగా పని చేస్తుండడంతో లావాదేవీలు, బిల్లుల చెల్లింపులు అన్నీ సత్యనారాయణ, మీనాలే చూసుకునేవారు. ఇరువురు కలిసి స్కానింగ్ చేసుకున్న వారికి ఇచ్చే బిల్లులు ఒరిజినల్ బిల్లుపై ఒక ధర, డూబ్లికేట్ బిల్లుపై మరో ధరను రాస్తూ దాదాపు రూ.70 లక్షల వరకు కాజేశారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా సత్యనారాయణ, మీనాల అవినీతి బయటకు వచ్చింది. సత్యనారాయణ తన భార్య పేరు మీద ప్లాట్లు కొనుగోలు చేయగా మీనా డబ్బులు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించారు. ఈ మేరకు సత్యనారాయణ, అతని భార్య, మరో మహిళ ఉద్యోగిని మీనాలపై కేసు నమోదు చేశారు. శుక్రవారం మాణిక్ భండార్ శివారులో గుండారం సత్యనారాయణను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని ఎస్ హెచ్ వో తెలిపారు.

