ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల గ్రామానికి చెందిన విద్యార్థులు విద్య, క్రీడలు, ఎన్సీసీ రంగాల్లో విశేష ప్రతిభ కనబరచి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.తెలంగాణ ఈసెట్లో 8వ ర్యాంకు సాధించిన దొబ్బల రెస్వాంత్ (తండ్రి రాజన్న), ఎన్సీసీ ఫైరింగ్ విభాగంలో తెలంగాణ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుధనవేని సాత్విక (తండ్రి శ్రీనివాస్ గౌడ్), నేషనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికైన కనుగుర్తి బాలమణి (తండ్రి ఎల్లయ్య)లను ఈ సందర్భంగా అభినందించారు.గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సున్నపు లక్ష్మి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొని విద్యార్థులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి సత్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ యువత విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ వంటి రంగాల్లోనూ రాణించి గ్రామానికి కీర్తి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. ఇతర విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
