. . . చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
తాళ్ల కొత్తపేట గ్రామంలో రోడ్లపై యథేచ్ఛగా గేదెలను కట్టివేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేదెల వ్యర్థాల కారణంగా దోమలు, ఈగలు, ఇతర క్రిమి కీటకాలు పెరిగి ఇళ్లలోకి చేరుతున్నాయని, దీనివల్ల మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బాధితులు పేర్కొంటున్నారు. ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులు ఇప్పటికే కొందరు గేదెల వ్యాపారులకు నోటీసులు జారీ చేసినప్పటికీ, వారు వాటిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై గేదెలను కట్టవద్దని సూచించినప్పటికీ కొందరు వ్యాపారులు ఎదురుతిరిగి దాడులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. గేదెల వ్యర్థాల వల్ల ఏర్పడుతున్న అపరిశుభ్ర వాతావరణం కారణంగా గ్రామంలో వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై పశువుల కట్టివేతను నియంత్రించాలని, పారిశుద్ధ్య పరిరక్షణ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

