నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చూస్తే నియంత పాలనకు నిదర్శనంగా నిలుస్తుందని బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు బీ ఆర్ ఎస్ ఎం ఎల్ ఏ, ఎం ఎల్ సీ లను అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకుని అన్యాయంగా, అక్రమ అరెస్టులు చేయడం చూస్తే ఇది ఒక నియంత పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది అన్నారు. భేషరతుగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ నవంబర్ 29 న మహానాయకుడు కేసీఆర్ ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్ష యావత్ దేశాన్ని కుదిపివేసిందన్నారు. దీంతో అప్పటి కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించేలా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు పునాది వేసిన డిసెంబర్ 9ని విజయ్ దివస్ గా తెలంగాణ ప్రజలు జరుపుకుంటున్నారన్నారు. 2007 లో కవులు, కళాకారులు, మేధావులు, పండితులతో చర్చించి వారి ప్రతీకగా కేసిఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగిందని, అలాంటి విగ్రహాన్ని ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక విగ్రహాన్ని మార్చడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సత్యప్రకాష్, నీలగిరి రాజు, తెలంగాణ శంకర్, ఫాయిం ఖురేషి, భూపతి, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
