. . . అమ్మాయి కుటుంబంపై హనీ ట్రాప్ కేసు పెట్టించింది ఎవరో చెప్పాలి
. . . మీడియా కార్యాలయాలకు ఫోన్ చేసి వార్తలు రాకుండా ఆపింది నిజం కాదా ?
. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు
హైదరాబాద్, బతుకమ్మ :
నిన్న ముఖ్యమంత్రి చేసిన అడ్డగోలు వ్యాఖ్యల పైన కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే ఆ కుటుంబాన్ని బెదిరించి కౌంటర్ కేస్ పెట్టించి, నిందితుడిని తొమ్మిది రోజులు కాపాడింది ముమ్మాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అన్నారు. మైనర్ బాలిక తనకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులతో పోలీస్ స్టేషన్కు వెళ్తే అర్ధరాత్రి వరకు నిలబెట్టి, తీవ్ర ఆవేదనకి గురిచేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి తొమ్మిది రోజుల పాటు నిందితుణ్ణి కాపాడారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం రాష్ట్ర హైకోర్టు బెయిల్ ఇవ్వనని తెగేసి చెప్పడం, తెలంగాణలోని ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోయడంతోనే సిగ్గు తెచ్చుకొని, చివరికి దిక్కులేని పరిస్థితుల్లో నిందితుణ్ణి అరెస్ట్ చేశారని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర హోంశాఖకు బాధ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్యటన వల్ల పోలీసులంతా బిజీ ఉన్నారని అడ్డగోలు సాకులు చెప్పినందుకు సిగ్గుపడాలన్నారు. ‘ప్రధానమంత్రి వస్తే మూడు రోజుల పాటు రేవంత్ రెడ్డి చంచల్గూడలో గడిపిన సన్నిహితులు బయట అడ్డగోలుగా నేరాలు చేయవచ్చా ? అలాంటి కారణాలు చెప్పడానికి ప్రభుత్వానికి సిగ్గున్నదా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. అత్యంత సున్నితమైన బాలిక విషయంలో పార్టీ తరపున మౌనంగా ఉన్నామని, ఏనాడూ రాజకీయం చేయలేదని కేటీఆర్ తెలిపారు. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి మా పైన విమర్శలు చేసిన తర్వాతనే తప్పని పరిస్థితుల్లో ఈ అంశం పైన మాట్లాడాల్సి వస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఒక పోక్సో కేస్ నిందితుడిని తొమ్మిది రోజులు దాచి పెట్టిన సందర్భం దేశంలో ఎక్కడైనా ఉన్నదా అన్న విషయం పైన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేవలం కేంద్రమంత్రి బండి సంజయ్కి, రేవంత్ రెడ్డికి ఉన్న అనుబంధం వల్లనే ఇద్దరు కలిసి నిందితుణ్ణి తొమ్మిది రోజులు దాచి ఉంచారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి సన్నిహితుడి ఆసుపత్రిలో తొమ్మిది రోజుల పాటు దాసపెట్టినారన్న వార్తలు వస్తున్నాయని, దీనిపైన ప్రభుత్వం విచారణ చేయాలన్నారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని బయటకు వస్తే ఆ అమ్మాయి కుటుంబం పైననే ‘హనీ ట్రాప్’ అంటూ కౌంటర్ కేస్ పెట్టి కుట్ర చేయించిన వెధవ ఎవరో చెప్పాలని బండి సంజయ్కి, ముఖ్యమంత్రికి కేటీఆర్ సవాలు విసిరారు. బండి సంజయ్ కొడుకు తనకు సంబంధం లేదని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకున్నాడని, అంతటి దుర్మార్గమైన పరిస్థితి ఏ తండ్రికి రావద్దని కేటీఆర్ అన్నారు. ఒకవైపు తన కొడుకుకు తనకు సంబంధం లేదని చెప్తున్న బండి సంజయ్, తిరిగి మళ్ళీ తానే పోలీసులకు అప్పజెప్పానని అనడం ఏంటిదో సమాధానం చెప్పాలన్నారు. దేశంలో ఎక్కడైనా పోక్సో కేస్ నిందితులు తొమ్మిది రోజులు తప్పించుకోలేరని, కేవలం కేంద్రమంత్రి కొడుకు కావడం, ముఖ్యమంత్రి అండదండలు ఉండడం వల్లనే తప్పించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఇది చూసిన తర్వాత రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా బలవంతుల పైన ఫిర్యాదు చేయడానికి వెనకాడే పరిస్థితి నెలకొందన్నారు. ఈ మొత్తం కేసులో, ఈ అంశంలో పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అద్భుతంగా ప్రభుత్వాన్ని, మీడియాను అలర్ట్ చేస్తూ ముందుకు పోయేలా చేశారని అభినందించారు.

అలాంటి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటల్ని కేటీఆర్ ఖండించారు. రేవంత్ రెడ్డి లాంటి దొంగ, దొంగలను ఎలా పట్టుకోవాలో పోలీసులకు చెప్పినట్లు వచ్చిన వార్తల పైన కూడా కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక దొంగనే తమకు దొంగల్ని ఎలా పట్టుకోవాలో చెప్తున్నారని పోలీసులు అనుకుంటారన్నారు. ఈ మొత్తం పోక్సో కేసు విషయంలో హనీ ట్రాప్ అంటూ అడ్డగోలు వార్తలు రాసిన మీడియా, రాయించిన వ్యక్తులు ఎవరో సమాధానం చెప్పాలని కేటీఆర్ అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్లు మీడియా కార్యాలయాలకు ఫోన్ చేసి కాళ్లా వేళ్లా పట్టుకొని వార్తలు రాకుండా ఆపింది వాస్తవం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా కొట్లాడింది తామే అని, అది లగచర్ల నుంచి మొదలుకొని అనేక అంశాల్లో మా పార్టీ తరఫున కొట్లాడుతున్నామని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్తో తనకు ఎలాంటి పంచాయితీ లేదు అని, బండి సంజయ్ తన తండ్రి గురించి అడ్డగోలుగా మాట్లాడినా ఏ రోజు నేను స్పందించలేదని కేటీఆర్ తెలిపారు. ఈ రోజు కూడా బండి సంజయ్ని ఏమనడం లేదని, కేవలం నేరస్థుడు ఎవడైనా నేరస్థుడే అనే ఆలోచనతోనే మాట్లాడుతున్నామని కేటీఆర్ అన్నారు. బండి సంజయ్ మాదిరిగా తన కొడుకుకి తన తండ్రికి సంబంధం లేదని చెప్పుకునే పిరికివాణ్ణి కాదని, మా నాన్న పేరు కేసీఆర్, నా కొడుకు పేరు హిమాన్షు అంటూ కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పోక్సో కేసు విషయంలో జరుగుతున్న అన్యాయం పైన ప్రశ్నిస్తే ‘మా బావమరిది ఇంటి పైన డ్రగ్స్ దాడి జరిగింది’ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కేసు ఎందుకు పెట్టడం లేదు అని, దమ్ముంటే కేసు పెట్టి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
