నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పిఎం పోషణ మినరల్స్ (రాగి జావ) నిర్వహణ కొరకు కార్మికులకు పారితోషకం ఇవ్వాలని సిపిఐ, ఏఐటియుసి నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జి జి కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లాఅడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పీఎం పోషణ మినరల్స్ జిల్లాలోని పాఠశాలల్లో రాగి జావా తయారు చేయడం కోసం రాగి జావా పౌడర్ బెల్లం పంపినప్పటికీ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ అందిస్తున్న కార్మకులకు మాత్రం ఇలాంటి పారితోషికం ఇవ్వడం లేదని, ఈ పథకం కోసం తెలంగాణలో 8 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నందున నిర్వాకులకు నెలకు వెయ్యి రూపాయలు ఇప్పించాలని కోరుతున్నామన్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మిస్ చార్జీలు పెంచాలని ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి 25 రూపాయలు చొప్పున స్లాబ్ రేట్ చెల్లించడంతోపాటు వంట కార్మికులకు తొలగించకుండా జీవోను విడుదల చేయాలని, వంట చేస్తున్న సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదివేల వేతనం చెల్లించాలని వీటితోపాటు కోడిగుడ్లు, వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి నర్సింగ్ రావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి హనుమాన్లు, యూనియన్ జిల్లా అధ్యక్షులు స్రవంతి, ప్రధాన కార్యదర్శి టి.చక్రపాణి జిల్లా గౌరవ అధ్యక్షురాలు సాయమ్మ ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో గంగాధర్, శ్రీను, నాగలక్ష్మి, బుచ్చయ్య మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

