. . . అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం ఐజిపి (పిఎల్) గజరావ్ భూపాల్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
రహదారులపై ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించడం సాధ్యమవుతుందని ఐజిపి (పిఎల్) గజరావ్ భూపాల్ అన్నారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిజామాబాద్ నగరంలో శ్రీరామ గార్డెన్స్ లో ఆటో, లారీ, అంబులెన్స్, గూడ్స్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమంలో ఐజిపి(పిఎల్) గజరావ్ భూపాల్ ముఖ్య అథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని న్నారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని , అతివేగం , నిర్లక్ష్య డ్రైవింగ్ , మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి ఆటో, లారీ డ్రైవర్లు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడపాలని , అధిక లోడ్తో ప్రయాణించకూడదని , నిర్దేశిత వేగ పరిమితులను పాటించాలని , అలసటతో లేదా నిద్రమత్తులో వాహనాలు నడపరాదని తెలిపారు. వాహనాల ఫిట్నెస్ , బ్రేకులు , టైర్లు , లైట్లు తదితర అంశాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలలో అధికముగా ద్విచక్ర వాహనాదారులు మరణిస్తున్నారని, పాదాచారులు కూడా ఎక్కువ మొత్తంలో రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలియజేశారు.

నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణ కోసం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంతో కృషి చేస్తుందని ఇదేవిధంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు , ప్రమాదాల వల్ల కలిగే నష్టాలు , ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత , అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై డ్రైవర్లకు వివరించారు. అలాగే హెల్మెట్ , సీట్బెల్ట్ వినియోగం , మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, సురక్షిత డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ప్రజల ప్రాణాల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని , రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ రహదారి భద్రతను తన వ్యక్తిగత బాధ్యతగా భావించి నిబంధనలు పాటిస్తేనే ప్రమాద రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం కంటి పరీక్షలు, చెవి పరీక్షలు క్యాంపు నిర్వహణను ప్రారంభించారు. తదుపరి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, వాణిజ్య వాహనాల డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసిపి బి. ప్రకాష్ యాదవ్, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి రమేష్ రాథోడ్, ఎన్.ఎస్.సి సెక్రెటరీ డాక్టర్ కవిత రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిఐలు, ఎస్ హెచ్ ఓ లు, ఎస్సైలు, ఐ రాడ్ జిల్లా మేనేజర్ హర్ష, లయన్స్ క్లబ్ డాక్టర్లు, ప్రభుత్వ హాస్పటల్ డాక్టర్లు, ట్రాఫిక్ పోలీసులు, రవాణాశాఖ ప్రతినిధులు, ఆటో యూనియన్ సభ్యులు, లారీ యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

