27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

దేశం, రాష్ట్రాభివృద్ధి అంశాలే తమ తొలి ప్రాధాన్యమని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, ఒక ‘అభివృద్ధి ఉత్సవం’ అని అన్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “2047 వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో తెలంగాణ తనవంతు భాగస్వామ్యం అందిస్తుంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా తెలంగాణ రైజింగ్ – 2047 లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు. మీ సంకల్ప సాధనలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పయనించాలని తెలంగాణ ఆకాంక్షిస్తోంది. తెలంగాణకు సంబంధించిన రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ – మచిలీపట్నం 12 వరుసల రహదారి వంటి ప్రతిపాదనలు మీ ముందుంచామని ప్రధానమంత్రి కి గుర్తుచేశారు. నా రాష్ట్రం, నా ప్రజల కోసం ప్రాజెక్టుల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను. తెలంగాణకు సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. రెండు గంటల సమయం కేటాయించి ఈ ప్రతిపాదనలన్నింటినీ సానుకూలంగా పరిశీలించాలని కోరారు. దేశ ఆర్థిక వృద్ధి మహానగరాల్లో వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలను అభివృద్ధి చేస్తేనే దేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశ అభివృద్ధి విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపాలని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని మీరు నిర్దేశించారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి దేశ జీడీపీకి 10 శాతం వాటా అందించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రైజింగ్‌కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీకు పెద్ద మనస్సు ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు కూడా మీపై అదే నమ్మకం ఉంది. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు, ప్రాజెక్టులన్నింటినీ ఆమోదిస్తారని ప్రజలు ఆశిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌లో నెలకొల్పిన పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్) ను ముఖ్యమంత్రి, గవర్నర్ తో కలిసి ప్రధానమంత్రి ప్రారంభించారు. అలాగే సంగారెడ్డి – జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, మహబూబ్‌నగర్ – గూడబెల్లూరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్ – 167), కాజిపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ గ్రీన్‌ఫీల్డ్ టెర్మినల్‌ను జాతికి అంకిత మిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, లోక్‌సభ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

 

Public welfare programs are beyond politics

More articles

Latest article