. . . ఆర్డీవో ప్రభాకర్
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో “ప్రజావాణి” కార్యక్రమం నిర్వహించబడుతుందని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత శాఖల డివిజన్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆర్డీవో ప్రభాకర్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరించి వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
