. అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
. 97 ఫిర్యాదులు నమోదు
నిజామాబాద్ సిటీ /భీమ్ గల్, బతుకమ్మ : ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులకు విన్నవించారు. వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వికలాంగులు తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

పాస్టర్ పై చర్యలు తీసుకోవాలని..
తమ తాత , ముత్తాతల నుంచి తాగునీటి కోసం తవ్విన చేదబావిని అక్రమంగా కూల్చివేసి , అనుమతి లేకుండా అడ్డుగోడను నిర్మించి, బావి స్థలాన్ని ఆక్రమించికొన్న చర్చి పాస్టర్ ఇజ్రాయెల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భీమ్ గల్ మాల సంఘం అధ్యక్షుడు డీఎస్ రవీందర్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గోడ విషయమై 2022లో స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో ఫిర్యాదు చేయగా అక్రమంగా నిర్మించిన గోడను కూల్చివేయాలని ఉత్తర్వులు వచ్చాయని, ఇప్పటికీ అధికారులు పట్టించుకోవడం లే దన్నారు. ఈవిషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని రవీందర్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో సంఘ సభ్యులు సంపత్, నర్సు, రంజిత్, నవీన్, భాగేశ్ తదితరులు ఉన్నారు.

జీజీహెచ్ లో నిధుల దుర్వినియోగంపై..
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిధుల దుర్వినియోగం పై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్వినియోగమైన నిధులను వెంటనే రికవరీ చేయాలని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

నష్టపరిహారం అందించాలని..
జాతీయ రహదారి పనుల్లో భూములు కోల్పోయిన తమకు గత ప్రభుత్వం అందించిన నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదని బోధన్ నియోజకవర్గంలోని సాలూరు మండలం సాలూర క్యాంపు వాసులు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట వారు నిరసన తెలిపారు. నేషనల్ హైవే 63 కారణంగా తాము నష్టపోయామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

చెరువు కబ్జాపై..
తమ గ్రామంలోని ఐదు చెరువులు కబ్జాకు గురయ్యాయని, మండల అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వర్ని మండలం చందూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ కు వినతిపత్ర అందజేశారు. తాము తీవ్రంగా నష్టపోతున్నామని, చేపలు దొరకక జీవనోపాధి కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని వారు కలెక్టర్ తో మొరపెట్టుకున్నారు.
