హైదరాబాద్, బతుకమ్మ: మిర్చ పంటకు రూ.25వేల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి ఆవరణలో వినూత్నంగా నిరసన తెలిపారు. మెడల్లో మిర్చీ దండలు వేసుకుని ప్ల కార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత సీజన్ లో 4లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగుకాగా, ధర లేకపోవడంతో ఈ సీజన్ లో సాగు విస్తీర్ణం 2లక్షల 40వేల ఎకరాలకు తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నాఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా మిర్చికి రూ.25వేల ధర నిర్ణయించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని అన్నారు.
ఎన్నికలకు ముందు ఒక మాట.. ఎన్నికల తరువాత మరోమాట
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తరువాత మరోమాట మాట్లాడుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆమె విలేకరులతో మాట్లడారు. కల్యాణమస్తు పథకం ద్వారా రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పారని, ఈ పథకంపై తాము కౌన్సిల్ లో ప్రశ్నించగా పథకం ప్రవేశపెట్టే ఆలోచనలేదని సమాధానం ఇచ్చార్నారు. మహిళా వ్యతిరేకిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు.

