. . . మన ఊరు – మన భధ్రత – మన బాధ్యత కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య
బోధన్, బతుకమ్మ :
ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ లు, కౌన్సిలర్ లతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ లోని లయన్స్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయదారులు రోడ్డు పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ల వాడకం నిషేధం అని అన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలన్నారు.

యువత ఆన్లైన్ బెట్టింగ్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రతీ ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలని హెచ్చరించారు. 2020 సంవత్సరంలో కరోనా ఫేస్ 1, ఫేస్ 2 లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది మృతి చెందారని, కానీ 2025 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల వలన దాదాపు 302 మంది మృతి చెందారని, జిల్లా వ్యాప్తంగా 47 మంది హత్య చేయబడ్డారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్, బోధన్ టౌన్ ఎస్.హెచ్.ఓ వెంకటనారాయణ, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, రుద్రూర్ సిఐ కృష్ణ, బోధన్ ఎం.వి.ఐ శ్రీనివాస్, ఎన్.ఎస్.సి ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాంబశివరావు, ఎన్.ఎస్.ఈ మెంబర్స్ దుష్యంత్, కొడాలి కిషోర్, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్, బోధన్ టౌన్ ఎస్ఐ మనోజ్, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, కోటగిరి ఎస్ఐ సునీల్, సర్పంచ్ లు, కౌన్సిలర్ లు, వార్డు మెంబర్ లు, ప్రజలు, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.

