. . . ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
క్షయ వ్యాధి పట్ల ప్రజలందరూ తగు జాగ్రత్తలు వహిస్తూ, వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తించి ఎటువంటి అపోహలు లేకుండా వెంటనే చికిత్సను తీసుకోవాలని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్ అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డా.రమణేశ్వర్ ఆధ్వర్యంలో ఐఎంఏ, విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రాంగణంలో సంయుక్తంగా క్షయ వ్యాధి యొక్క అవగాహన, నివారణ, సూచనలు, లక్షణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగర మేయర్ ఉమారాణి రమేష్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులు, పారిశుద్ధ కార్మికులు, దినసరి వేతన కూలీలు క్షయ వ్యాధి బారిన పడి సరైన సమయంలో డాక్టర్లను సంప్రదించక, వ్యాధి ముదిరిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండి పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వలన వ్యాధి నుండి రక్షించుకోవచ్చని తెలియజేశారు. అనంతరం క్షయ వ్యాధి నిర్మూలన పై అవగాహన పోస్టర్ ని ఐఎంఏ కార్యవర్గం తో కలిసి విడుదల చేశారు.

అనంతరం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతు ఐఎంఏ ఎప్పుడు ప్రజలతో కలిసి నడుస్తుందని, ఐఎంఏ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు, ఉద్యోగులకు రాబోయే రోజుల్లో హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ అవగాహనా కార్యక్రమం లో ఐఎంఏ అధ్యక్షులు విశాల్, ప్రధాన కార్యదర్శి హరీష్ స్వామి, డాక్టర్ జీవన్ రావు, శిల్ప వేణుగోపాల్, డా.శ్రీశైలం, డా.వినోద్ కుమార్, డా.నవీన్ మాలు హాజరై తగు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ కు ఆసుపత్రి వైద్యులు డా.రమేష్ శాలువా, పూల మొక్కతో పాటుగా జ్ఞాపికను ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విష్ణు హాస్పిటల్ డాక్టర్ల బృందం, ఆసుపత్రి మేనేజ్మెంట్, సిబ్బంది పాల్గొన్నారు.

