నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రైతు మహోత్సవం స్టాళ్లను బుధవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన రైతు మహోత్సవం బుధవారం ముగిసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించారు.

నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. అధిక దిగుబడులను అందించే వంగడాలు, మేలు జాతి పాడి పశువులు, సాగు పరికరాలు, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను తిలకించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులను అందించే వంగడాలు, తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించారు.

