బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : రబీ పంటల సాగు కోసం జనవరి ఒకటో తేదీ నుండి పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు ఎల్లారెడ్డి నీటిపారుదల శాఖ డిఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోని నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాల రైతులతో తైబందీ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రబీలో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ఏ జోన్ కు సాగునీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1,820 టీఎంసీలకు గాను 1.650 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు, నీరు రబీ పంటల సాగుకు పూర్తిగా సరిపోతాయన్నారు. జనవరి ఒకటి నుండి ఐదు విడతలుగా నీటిని విడుదల చేస్తామని, 15 రోజులపాటు నీటిని విడుదల చేసి పది రోజులపాటు నీటి విడుదల నిలిపివేసి నీటిని విడుదల చేయడం జరుగుతుందని రైతులు నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్, వర్క్ ఇన్స్పెక్టర్ యాదగిరి, మాజీ ఎంపీపీ దివీటి రాజు దాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి రామచంద్ర రెడ్డి, విట్టల్ రెడ్డి, ఇమామ్, కిష్టయ్య, గులాం, ఫారూఖ్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
