- యంత్రాలతో తవ్వకాలు .. టిప్పర్లతో రవాణా
- కల్దుర్కి, సిద్దాపూర్ లో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇసుక క్వారీలకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దానితో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని, స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్ లకు అనుమతులు ఇచ్చింది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో గల మంజిరా పరివాహక ప్రాంతాల్లో ఆరు పాయింట్లను గుర్తించిన అధికారులు రెండు పాయింట్లకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మార్వో ద్వారా వే బిల్లులు తీసుకుని ఇసుకను తరలించేందుకు పర్మిషన్ ఇచ్చారు. సిద్దాపూర్, కల్దుర్కిలలో ఇసుక తవ్వకాలకు పర్మిషన్ ఇవ్వగా ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేస్తూ టిప్పర్లతో తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక అవసరాల సంగతి పక్కనపోయి ఇతర ప్రాంతాలకు తరలించే దందా షురూ అయింది.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సిద్దాపూర్, కల్దుర్కి గ్రామంలోని మంజీరా పరివాహక ప్రాంతం నుండి ఇసుక రవాణాకు అధికారులు పరిమిషన్ ఇవ్వడంతో ఇతర గ్రామాల నుండి ట్రాక్టర్లు పెద్దమొత్తంలో రావడంతో గ్రామస్తులు ట్రాక్టర్లను నిలిపివేశారు.రైతులు ఆందోళన చేస్తున్నారు.

పంటపొలాలకు వేసిన పైపులు ఇసుక ట్రాక్టర్ల వలన పగిలిపోతున్నాయని దీనివలన పంటలు నాశనం అవుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణా జరుగకుండా అడ్డుకోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులచే ఆందోళన విరమింపజేశారు. ఇసుక అక్రమ రవాణా తవ్వకాలపై నిజామాబాద్ మైన్స్ ఏడిఈ విజయ్ కుమార్ రాథోడ్ ను వివరణ కోరగా తనకు ఆలస్యంగా తెలిసిందని ఈ విషయంలో స్థానిక ఎమ్మార్వోలు వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరన్నారు. తామే అక్కడికి పంపించి వివరాలు తెలుసుకుంటున్నామని తెలిపారు.

