. . . తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి ఉద్యోగికి హక్కుగా ఉన్న ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ట్రెజరీ శాఖలో పెండింగ్లో ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిని వెంటనే మంజూరు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలో పర్యటించిన ఆయన ఐడీఓసీ కార్యాలయంలో గ్రామ పరిపాలన అధికారులు, రెవెన్యూ ఉద్యోగులతో సమస్యలను సమీక్షించి, అనంతరం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కి నివేదిక సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తహసిల్దార్ల అసోసియేషన్, జీపీయూల అసోసియేషన్, డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ సమావేశాల నిర్వహణకు తగిన స్థలం లేదని, కనీసం 10 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించాలని, శాశ్వత స్థలం కేటాయింపు వరకు తాత్కాలికంగా నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ భవనంలో సమావేశాల కోసం ఒక గది కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన తహసీల్దార్ లను తిరిగి వారి స్వస్థల జిల్లాలకు బదిలీ చేయాలనే అంశంపై ముఖ్యమంత్రిని కలిసి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. అలాగే ఇప్పటికే సర్వే ట్రైనింగ్ పూర్తి చేసి తదుపరి ప్రమోషన్కు అర్హత సాధించిన వారికి సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి ఇవ్వాలని కోరారు. ఇంకా సర్వే ట్రైనింగ్ పొందని ఉద్యోగులను తక్షణమే ట్రైనింగ్కు పంపించే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆఫీస్ అపార్ట్మెంట్లో పని చేస్తున్న అర్హత గల రికార్డ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు వీఆర్ఏల నుండి జీపీఏలు, రికార్డు సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన వారికి సమాన న్యాయం కల్పిస్తూ వారి సేవలను పూర్తిస్థాయిలో గుర్తించాలని కోరారు. అలాగే విధుల్లో ఉండగా మరణించిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు కంపాషనేట్ అపాయింట్మెంట్ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిన్న చిన్న సమస్యలు సహా అన్ని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పరిపాలన అధికారులు, వీఆర్ఏలు, టీజీఆర్ఎస్ఏ, తహసిల్దార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీఆర్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బాణాల రామ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బిక్షు, జిల్లా అధ్యక్షుడు దేవి సింగ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, టీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ జీపీఆర్ఎస్ అధ్యక్షులు కిషన్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

