నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ లో కౌండిన్య మహిళా గౌడ సంఘం, పట్టణ గౌడ సంఘం 1 సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గౌడ కళ్యాణ వేడుకలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సంబరాలకు ముఖ్యఅతిథిగా పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సతీమణి సంధ్యారాణి హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. చిత్తూ చిత్తూల గుమ్మ.. శివుని ముద్దుల గుమ్మ అంటూ బతుకమ్మ పాటలను అనుకరిస్తూ మహిళల్లో జోష్ నింపారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అట్ల బతుకమ్మ రోజున గౌడ మహిళా సోదరీమణులతో కలిసి బతుకమ్మ పండుగను ఆడడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగను అలాగే వచ్చే దసరా పండుగను సుఖ సంతోషాల నడుమ జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లాలో గౌడ సంఘం నుంచి మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఆర్భాటంగా మహిళలను గౌరవ పరుస్తూ బతుకమ్మ పండగ అధికారకంగా ఆడేందుకు సిద్ధంగా ఉందన్నారు.
