- సమాజంలో మంచి వారితో స్నేహం చేస్తే అంతా మంచి జరుగుతుంది
- చిన్ననాటి నుంచి చిన్నారులకు ఆధ్యాత్మిక వైపు నడిపించండి
- సైకాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి
బీర్కూర్, బతుకమ్మ : సమాజంలో మంచి వారితో స్నేహం చేస్తే అంతా మంచి జరుగుతుందని, ఏదైనా సాధించాలంటే ఓపిక చాలా అవసరమని, చిన్నారులకు చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక వైపు నడిపించాలని హైదరాబాద్ కు చెందిన సైకాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించి, పలు అంశాలు, విషయాలపై వివరించారు. ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపడానికి సమాజంలో ఎలా నడుచుకోవాలి, విద్యార్థులు ఎలాంటి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి, చిన్నారులకు సెల్ ఫోన్లకు దూరంగా ఎలా ఉంచాలి, సమయాన్ని ఎలా చదివినగం చేసుకోవాలి అనే తదితర విషయాలపై కులం కుశంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సైకలాజిస్ట్ వివరించారు. నిరంతరం నీకు తోడు ఉండేది భగవంతుడని, సమయాన్ని వృధా చేస్తే మళ్లీ తిరిగి రాదని, మంచి లక్ష్యాన్ని ఎన్నుకొని ప్రతిరోజు పుస్తక పఠనం చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఉండేలా స్థానిక యువకులు, పెద్దలు కృషి చేయాలన్నారు. మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నవారు సైతం ఆధ్యాత్మిక వైపు దృష్టి సారిస్తున్నారని, పలువురు సమయాన్ని కేటాయించి హిమాలయాల్లో నెలరోజుల పాటు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి భగవంతుని నామస్మరణలో నిమగ్నమవుతున్నారన్నారు. కుటుంబానికి మూల స్తంభం కుటుంబ పెద్ద అని అతను మంచి మార్గంలో నడిస్తే అందరూ మంచి మార్గంలో నడుస్తారన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏదైనా విషయం ఎవరికైనా చెప్పే సమయంలో ప్రేమగా చెబితే అర్థమవుతుందన్నారు. మన జీవితం మన చేతిలోనే ఉంటుందన్నారు. ప్రపంచంలో అత్యంత విలువైనది సమయం అన్నారు. గ్రామస్తులు సైకాలజిస్ట్ చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్నారు. అనంతరం కింగ్స్ యూత్ సభ్యులు సైకాలజిస్ట్ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కింగ్స్ యూత్ అధ్యక్షులు విజయ జట్టి, ఉపాధ్యక్షులు మారిశెట్టి హనుమాన్లు, సభ్యులు భాస్కర్, సాయి, రాజు, నర్సారెడ్డి, శ్రీధర్, శ్రీకాంత్, మాజీ సర్పంచ్ పులెన్ బాబు రావు, సాయిలు భారతి, కిషోర్, గ్రామ పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

