నవీపేట్, బతుకమ్మ : విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన నవీపేట్ మండలంలోని లింగాపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి చెందిన రెంజర్ల పోశెట్టి(40) వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామానికి చెందిన కళ్లెం శివ తన వ్యవసాయ భూమిలో గల విద్యుత్ స్తంభానికి తీగలు బిగించడానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరా ఉన్నదో లేదో తెలుసుకోకుండా విద్యుత్ స్తంభం ఎక్కి తీగలను తాకాడు. ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేసి ఆదుకోవాలని స్థానికులు సంఘటనా స్థలంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోశెట్టి పెద్దదిక్కుగా ఉండి కుటుంబానికి పోషించేవాడని తన భార్య పిల్లలు పరిస్థితి దయనీయంగా మారుతుందని బందువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నవీపేట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
