. . . ఆర్మూర్ లో 22 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్
ఆర్మూర్, బతుకమ్మ :
ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల ద్వారా పట్టణంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. గురువారం ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని భక్త ఆంజనేయ మందిరం లో 22 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు. ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్ హెచ్ఓ సత్యనారాయణ, కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ (దియా), జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులు రాజేందర్ గౌడ్, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ ప్రవీణ్ చారి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

