నిజామాబాద్, బతుకమ్మ : గోవా రాష్ట్రంలో ఆగస్టు 7 న జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభకు సంబంధించిన గోడపత్రికను గురువారం నగరంలో జిల్లా బీసీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున బీసీలు మహాసభకు తరలి రావాలని జిల్లా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ఓబీసీ జాతీయ మహాసభలను నిర్వహిస్తారన్నారు. మహాసభలో బీసీలకు దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ.. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% ఇవ్వాలనుకున్న రిజర్వేషన్లను కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ రంగాలలో బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. దేశంలో 60 కోట్ల బీసీల స్థితిగతులపైన చర్చించడం జరుగుతుందన్నారు. అన్ని రాష్ట్రాలలో జరగబోయేటువంటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలని, అన్ని రాజకీయ పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కరిపె రవిందర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, అన్నయ్య, శ్రీలత, బగ్గలి అజయ్, విజయ్, బసవసాయి, చంద్రకాంత్, జయ, బాలన్న, సదానంద్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
