- కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ అధికారులు
- వన మహోత్సవంలో చెట్లను నాటడానికి పరిమితమవుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
రుద్రూర్, బతుకమ్మ : బెల్టు షాప్ లపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం వన మహోత్సవంలో చెట్లను నాటడానికి పరిమితమవుతున్నారని పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి క్యాంపు గ్రామంలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఈత చెట్లను నాటారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు అక్బర్ నగర్, రాణంపల్లి, రాయకూర్, సులేమాన్ నగర్ తదితర గ్రామాలల్లో ఎక్కడ చూసినా బెల్టు షాపుల కిక్కు ఫుల్ గా కనిపిస్తోంది. గ్రామాలల్లో బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా బెల్ట్ షాపుల దందా కొనసాగిస్తున్నారని, తనిఖీలు చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం ఎటువంటి తనిఖీలు చేయకపోవడంతో ముడుపులు తీసుకుని మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగడంతో యువత వయసుతో సంబంధం లేకుండా మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మరణాలకు దిగుతూ నేరస్తులుగా మారి పలు కేసుల్లో చిక్కుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా బెల్ట్ షాప్ లు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అంతర్యమేమిటని పలువురు ప్రశ్నించుకుంటున్నారు.
