బాల్కొండ, బతుకమ్మ :
బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం జాతీయ పతాక స్వీకరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా ఆమోదించిన చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయ జెండాను చేత భూని దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు జాతీయ జెండా ప్రాముఖ్యతను, దాని రూపకల్పనను, మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివరించారు. ఇలాంటి ఉత్సవాలు పిల్లల్లో విద్యార్థుల్లో జాతీయ భావాన్ని రగల్చడానికి ఎంతగానో ఉపకరిస్తాయి అన్నారు. జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి పింగళి వెంకయ్యను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి ప్రధాన ఉపాధ్యాయులు, ఎం ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

