ఎల్లారెడ్డి, బతుకమ్మ :
వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. మంగళవారం ఎల్లారెడ్డి పీఎస్ కు వచ్చిన ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డికి కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్రతో కలిసి ఐజీ పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరును సమీక్షించారు.

ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, సీసీటీఎన్సీలో ప్రతి కేసు వివరాలను సకాలంలో నమోదు చేయాలని సూచించారు. వీపీలు గ్రామాలను తరచూ సందర్శించి సమాచారాన్ని సేకరించాలని, గ్రామస్తులతో సత్సంబంధాలు పెంపొందించి నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. బాధితులతో మర్యాదగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి మెరుగైన పోలీసింగ్ అందించాలన్నారు. ప్రజల విశ్వాసమే పోలీసు శాఖకు అతిపెద్ద బలం. ప్రజల భద్రతే మా తొలి ప్రాధాన్యత అని ఐజీపీ అన్నారు.
