- తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఎయిడ్స్ తో నివసించే ప్రజలకు సహాయం అందించి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంటోల్ సొసైటీ, తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాయి రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ వర్సిటీ వైస్- ఛాన్స్లర్ ఆచార్య టీ.యాదగిరి రావు మాట్లాడుతూ ఎయిడ్స్ తో నివసించే ప్రజలకు సహాయం అందించి వారికి నైతిక మద్దతు ఇవ్వాలన్నారు. వారిపై ఉన్న కళంకం మరియు వివక్షను తగ్గించి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవనశైలిని ప్రోత్సహించాలన్నారు. ప్రాణాంతకమైన ఎయిడ్స్ పై తెలంగాణ వర్సిటీ విద్యార్థులకు విద్యార్థినులకు అవగాహన కల్పించాడo అభినందనీయమైనదని పేర్కొన్నారు.ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు తమ గ్రామంలో మురికివాడల్లో నివసించే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండి మానవతా విలువలను పెంపొందించినట్టయితే సామాజిక రుగ్మతలు తగ్గుతాయని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొని గతంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిందన్నారు.యువత పూర్తి అవగాహనతో మెదులుకుంటే ఎయిడ్స్ కూడా పూర్తిగా నిర్మూలించవచ్చని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ మామిడాల ప్రవీణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఫార్మా రంగం ఎంతో అభివృద్ధి చెందినదన్నారు. ప్రాణాంతకమైన అన్ని వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయని భారతదేశం ఆరోగ్య పరిశోధనల అభివృద్ధిపై దృష్టి సారించిందని పేర్కొన్నారు.ఎయిడ్స్ సోకిన వారిని చిన్న చూపు చూడకుండా మన శక్తి మేర అండగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీందర్ రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎన్ఎస్ఎస్ సెల్ కార్యదర్శి నరసింహ గౌడ్, జిల్లా ఎయిడ్స్ ప్రాజెక్టు మేనేజర్ సుధాకర్ జిల్లా ఆరోగ్య ఎడ్యుకేటర్ జి వెంకటేశ్వర్లు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వప్న డాక్టర్ ఐలేని మహేందర్ డాక్టర్ సంపత్ డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
