డిల్లీ, బతుకమ్మ : ఉపరాష్ట్ర పతి ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో మాక్ ఓటింగ్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో ‘మాక్ పోల్’ లో ఇండియా కూటమి పక్షాల ఎంపీలు పాల్గొంటారు. సాయంత్రం ఎన్డీయే కూటమి పక్షాల ఎంపీలు మాక్ పోల్ లో పాల్గొంటారు. రాత్రి 7.30 నిమిషాలలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పిసి మోడీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. అధికార ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది. మంగళవారం పార్లమెంట్ హౌస్లోని వసుధలోని రూమ్ నెంబర్ ఎఫ్-101లో పోలింగ్ జరుగుతుందని పిసి మోడీ తెలిపారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటించనున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం 781 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత రాష్ట్ర సమితి దూరంగా ఉండనుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున పోలింగ్ దూరంగా ఉండాలని ఆపార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈనెల 9న జరగనుంది.
