హైదరాబాద్, బతుకమ్మ : జిల్లాలోని సమస్యలను అర్బన్ ఎమ్మెల్యే ధన్ సూర్యనారాయణగుప్తా మంగళవారం అసెంబ్లీలో లెవనెత్తారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 50,000 మంది పేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు చేసుకున్నారన్నారు. నియోజకవర్గంలో స్థలం లేని లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. తక్షణమే మొదటి విడుతలోనే వారికీ ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే నాగారంలో 396 కలెక్టర్ బైపాస్ లో 252 డబుల్ బెడ్రూంలు నిర్మించి వదిలేయడంతో శిథిలావస్థకు చేరాయన్నారు. గతంలో ఈ ఇళ్ల మరమ్మతు పనులకు రూ. 1.25 కోట్లు మంజూరయ్యాయని, అవి సరిపోవని అదనంగా రూ. 3 నుంచి 4 కోట్లు కేటాయించాలన్నారు. ఇళ్లకు మరమ్మతులు పూర్తి చేసి లబ్ధిదారులకు జూన్ 2 లోపు అందించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఇవ్వాలనుకుంటుందా? లేక మొత్తం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో స్పష్టం చేయాలన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా కలుపుకొని ఇస్తే ప్రకటనల్లో, పథకం అమలులో ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలి
తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ లో 800 మంది విద్యార్థినులకు ఒకటే హాస్టల్ ఉందన్నారు. దీంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం మరో హాస్టల్ ను నిర్మించాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీకి వెంటనే ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
నిజామాబాదు జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాదు బస్టాండ్ రెన్నోవేషన్ వర్క్ అండ్ అప్ గ్రేడేషన్ కు నిధులు మంజూరు చేయాలని సంబంధిత మంత్రిని కోరారు.
పబ్లిసిటీ స్టంట్గా నిజామాబాద్ ఐటీ హబ్
నిజామాబాద్ ఐటీ హబ్ని భారీ ప్రాజెక్టుగా ప్రకటించి, వేలాది ఉద్యోగాలు వస్తాయని బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పిందన్నారు. ఐటీ హబ్ కేవలం పబ్లిసిటీ స్టంట్గానే మిగిలిపోయిందన్నారు.ఈవిషయంలో బీఆర్ఎస్ హయాంలో మోసం జరిగిందని, కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం జరుగుతుందాన్నారు. జిల్లాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పన అవకాశలపై ద్రుష్టి సారించాలని సూచించారు. నిజామాబాదు ను తెలంగాణ ఐటీ ఎక్సపెన్షన్ హబ్ గా మార్చాలని కోరారు.
ఎస్డీఎఫ్ నిధులు
ప్రతి నియోజకవర్గానికి ఎస్డీఎఫ్ నిధులు సమానంగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను కూడా సమానంగా చూడాలన్నారు.
