బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం మండల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త ముస్కు అనూప్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అరుణ్ కుమార్ శర్మ సూచనలతో వేద పండితులు అవధాని రాజేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి యజ్ఞాలు హోమాలు జరిపించామన్నారు. స్వామి వారికి విశేషంగా గౌరీ గణపతి ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచనం, నవగ్రహ వాస్తు క్షేత్రపాలక సర్వతోభద్ర మండప యోగిన్యా ఇత్యాది మండప దేవత ఆరాధన, విశేషమైన స్వామివారి ప్రతిష్టంగా దేవాలయ పరివార దేవత మూలమంత్ర హోమాలు వైదిక పద్ధతిలో నిర్వహించామన్నారు. ఆలయ ధర్మకర్త ముస్కు అనూప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

