నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఢిల్లీలో నేషనల్ కోపరేటివ్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దిలీప్ సంఘానే ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వార్షిక మహాజన సభలో తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంస్థను ఉద్దేశించి మాట్లాడారు. సహకార సంఘాలలో పెరిగిపోతున్న నిరాశ నిర్లక్ష్యం, అదేవిధంగా సహకార సంగానికి సభ్యులకు మధ్య ఉన్న భారీ అగాధాన్ని పూడ్చే విధంగా ప్రజలు రైతులు సహకార సంఘం అంటే తమది అని అనుకోవాలి అంటే మరొక్కసారి ప్రజలకు రైతులకు సహకార సంఘాల పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేషనల్ కోపరేటివ్ యూనియన్ తీసుకోవాలి అని అన్నారు. దానికి రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్లు సహకరించినప్పుడే గ్రామాలలో సహకార యూనియన్ యొక్క మనుగడ కొనసాగుతుందని తెలిపారు. నేషనల్ కోపరేటివ్ యూనియన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు తెలుపుతామని తెలిపారు. సహకార సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి, సహకార సంఘాలకు ఎక్కువగా ప్రచారం నిర్వహించడం ద్వారా గ్రామాలలో ఆదరణ లభించే అవకాశం ఉందని అన్నారు. సహకార ఉద్యమాన్ని మరొక జాతీయ ఉద్యమంగా మలిచే విధంగా జాతీయ కోపరేటివ్ యూనియన్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధంగా వున్నారని ఆయన పేర్కొన్నారు.

