
. గుట్టకింద అనుమతి.. మీద తవ్వకాలు
. పర్మిట్ లేకుండా యథేచ్ఛగా మొరం రవాణా
. రాత్రి వేళల్లో టిప్పర్ల హోరు
మొరం మాఫియా గుట్టలను మాయం చేస్తోంది. మొరం అక్రమరవాణాకు పాల్పడుతున్న వారి జాబితాను పోలీస్ కమిషనర్ రూపొందించగా, వారిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. అయినప్పటికీ మాఫియా తీరులో మార్పు రాలేదు. మల్లారం గుట్టపై కన్నేసిన మాఫియా.. గుట్ట కింద అనుమతులు తీసుకుని గుట్టపై తవ్వకాలు చేపడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
నిజామాబాద్, బతుకమ్మ: అనుమతులు లేకుండా యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతున్న మొరం మాఫియా ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటోంది. జిల్లాలో మొరం అక్రమంగా రవాణా చేస్తున్న వారి జాబితాను ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్ కమిషనర్ రూపొందించారు. వారిని తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. అయినప్పటికీ మొరం మాఫియాలో ఎ మాత్రం మార్పు లేదు. వారిప్పుడు గుట్టలను మాయం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా చేపడుతున్న భవన నిర్మాణాల అవసరాలు, రోడ్లకు మొరం సరఫరా చేసేందుకు గుట్టలను చెర బట్టారు. మొరం మాఫియా కాలు పెట్టిన చోట గుట్టలు మాయమవుతున్నాయి. వర్ని రోడ్డులోని మల్లారం గుట్టపై కన్నేసిన మాఫియా రాత్రీ పగలు తేడా లేకుండా పొక్లెయిన్ లతో మొరం తవ్వుతోంది. ధరణి వెంచర్ సమీపంలోని గుట్టకు ఇప్పుడు మొరం మాఫీయా ఎసరు పెట్టింది.
నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గుట్ట సర్వే నం 423/1 లోని ప్రభుత్వ భూమిలో మొరం తవ్వేందుకు ఓ ప్రైవేట్ వ్యక్తికి జిల్లా మైనింగ్ శాఖాధికారులు అనుమతిచ్చారు. జూలై లో 2.02 హెక్టార్లలో 5 సంవత్సరాలపాటు మొరం తవ్వకాలు చేపట్టే వీలుంది. మైనింగ్ శాఖ ఓ దగ్గర అనుమతులు ఇస్తే మరో చోట తవ్వకాలు చేపడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం అనుమతించిన ప్రాంతంలో ఇంకా ర్యాంపుల ఏర్పాటు పనులు జరుగుతుండగా, మరోవైపు గుట్టను తొలిచేస్తున్నారు. పగటి వేళ సైలెంట్ గా ఉంటూ గుట్టపై తవ్వకాలు చేపడుతూ రాత్రివేళల్లో మొరం జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో టిప్పర్లు నిజామాబాద్ ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. సీపీ తయారు చేసిన మొరం మాఫియా జాబితాలో ఉన్న ప్రధాన సూత్రధారి రెండు జేసీబీలను పెట్టి పదుల సంఖ్యలో టిప్పర్లలో తరలిస్తున్నారు. గత వినాయక చవితి ఉత్సవాలను అడ్డుపెట్టుకుని దాని పేరుమీద కాంట్రాక్ట్ రాకున్నా తవ్వకాలు చేపట్టిన మొరం మాఫియా.. పండుగ తరువాత కుడా తవ్వకాలు చేపడుతోంది. మొరం తవ్వకాల వెనుక ఉన్నది ఒకప్పటి అధికార పార్టీ నేత కావడంతో వారికి రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల వెన్నుదన్ను ఉందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం మారినా అధికార పార్టి నేతల ప్రమేయం లేకుండానే ప్రజా ప్రతినిధి భర్త ఒక్కరే మొరం తవ్వకాలు చేయడం లేదని స్థానికుల అండదండలు ఉన్నయని ఆరోపణలు ఉన్నాయి. మొరం తవ్వకాలపై నిజామాబాద్ రూరల్ తహసీల్ధార్ కార్యాలయం అధికారులు స్పందించకపోవడంతో వే బిల్లులు లేకుండా బహిరంగంగా తవ్వకాలు సాగుతున్నాయి.


